కలం, వెబ్ డెస్క్: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్రంగా విమర్శించారు. ఈ డీల్ చట్ట విరుద్ధమని అమెరికాలోని కోర్టు కొట్టేసిందని, ఆపాటి ధైర్యం మీకు లేదా? అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని ధైర్యముంటే ట్రేడ్ డీల్ను రద్దు చేయాలని సవాల్ విసిరారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ జరిగిన ‘కిసాన్ మహాచౌపాల్’ రైతు ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎస్తో ట్రేడ్ డీల్ను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. భారత రైతుల గుండెల్లో గునపం లాంటిదన్నారు.
‘ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ట్రేడ్ డీల్ను రద్దు చేసింది. ఆ తీర్పు తర్వాత అయినా వాణిజ్య ఒప్పందాన్ని ప్రధాని మోదీ రద్దు చేయలేరా? ధైర్యముంటే ఈ డీల్ను ప్రధాని రద్దు చేయాలని సవాల్ విసురుతున్నాను. కానీ, ఆయన అలా చేయలేరు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. యూఎస్తో ఎఫ్టీఏ భారత రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. ఎప్స్టీన్ ఫైల్స్ కారణంగా, పారిశ్రామికవేత్త అదానీని రక్షించేందుకు ఈ ఒప్పందంపై మోదీ సంతకం చేశారని రాహుల్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి ప్రధాని లొంగిపోయారని వ్యాఖ్యానించారు.
‘ఇది ఒప్పందం కాదు.. దేశ రైతుల గుండెల్లో గుచ్చిన గునపం’ అని రాహుల్(Rahul Gandhi) అన్నారు. ఈ డీల్ ద్వారా వ్యవసాయం, డేటా, టెక్స్టైల్, దిగుమతి రంగాల ప్రయోజనాలపై ప్రధాని రాజీ పడ్డారని ఆయన ఆరోపించారు. దీనిపై నిలదీస్తాననే లోక్సభలో తనను మాట్లాడనివ్వలేదని అన్నారు. కాగా, కిసాన్ మహాచౌపాల్ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.

