కలం, వెబ్ డెస్క్ : అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Ayodhya Trust)లో వేల కోట్ల రూపాయల విరాళాల చోరీ జరిగిందని ఆరోపిస్తూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే (Kharge) సంయుక్తంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి ఒక లేఖ రాశారు.
ఎంతో నమ్మకంతో భక్తులు తమ కష్టార్జితాన్ని విరాళాలుగా ఇస్తే, అక్కడ జరిగిన భారీ ఆర్థిక అక్రమాలు, చోరీ వల్ల వారు తీవ్రంగా మోసపోయారని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ట్రస్ట్ ఏర్పాటును పార్లమెంట్లో ప్రకటించినప్పటికీ, అందులోని సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా నియమించిందని వారు గుర్తు చేశారు. ట్రస్ట్ సభ్యులకు ఆర్ఎస్ఎస్, వీహెచ్పీలతో అనుబంధం ఉందని, అలాగే వివాదాస్పదంగా మారిన మాజీ జనరల్ సెక్రటరీ ప్రధానికి అత్యంత సన్నిహితుడని లేఖలో ఆరోపించారు.
ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు, చోరీ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నా ప్రధానమంత్రి మౌనంగా ఉండటం సరికాదని, ఈ విషయంలో జవాబుదారీతనాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రధానిపైనే ఉందని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. ఈ ఆర్థిక అక్రమాలపై తక్షణమే స్వతంత్ర, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు.
ట్రస్ట్కు (Ayodhya Trust) వచ్చిన నగదు, బంగారం, వెండి వంటి అన్ని రకాల కానుకల నిర్వహణపై పూర్తి విచారణ జరిపించాలని కోరారు. దర్యాప్తు నివేదికతో పాటు ట్రస్ట్ ఖాతాల వివరాలను కూడా బహిరంగపర్చాలని, తద్వారా భక్తుల కానుకలు ఎలా వినియోగించబడ్డాయో ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ దోపిడీకి కారణమైన వారు ఎంతటి లీడర్లు లేదా ఎంతటి ప్రభావవంతమైన వ్యక్తులైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ, ఖర్గే డిమాండ్ చేశారు. ప్రభుత్వ విశ్వసనీయత ఈ విచారణపైనే ఆధారపడి ఉంటుందని, దేశ ప్రజలంతా దీనిని గమనిస్తున్నారని వారు లేఖలో హెచ్చరించారు.
Read Also: బీసీ ప్లాన్: కమలం పార్టీ కొత్త వ్యూహం!
Follow Us On : WhatsApp

