కలం, వెబ్ డెస్క్ : నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) అన్నారు. మానవ వనరుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం సమస్యను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళిక పైన నిర్వహించిన సమావేశంలో రఘురామ్ రాజన్ పలు సూచనలు చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రఘురామ్ రాజన్ తో పాటు డీప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు , సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీల జయేష్ రంజన్, వాణీ ప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రఘురామ్ రాజన్ (Raghuram Rajan) మాట్లాడుతూ.. ప్రభుత్వాల సులభతర వ్యాపార విధానం మీద ఆధారపడి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని సూచించారు. అయితే స్టార్టప్ లను ఎక్కువ ప్రోత్సహిస్తే మరింత ఉపయోగం ఉంటుందన్నారు.
పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్య సిలబస్ లో ఏఐ ఉపయోగం పైన కమిటీ ఏర్పాటు చేస్తామని, తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రఘురామ్ రాజన్ ను కోరారు. దీంతో పాటు మిడిల్ లెవల్ ఉద్యోగాల కల్పన కోసం స్కిల్స్ యూనివర్సిటీ, ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం ఆయనకు వివరించారు. సరైన పద్దతిలో ఏఐ ని వినియోగిస్తే అందరికి మేలు జరుగుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ చెప్పారు. తమిళనాడు తరహాలో పారిశ్రామిక విధానం ఉంటే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు నాలుగు నెలల్లో హైదరాబాద్ పర్యటనకు వస్తానని ఆయన తెలిపారు.
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ లో ముందుకు సాగుతున్నాం : భట్టి
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి (Bhatti) మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కావాల్సిన భూమితో పాటు మౌలిక సదుపాయాలు ఉన్నాయని వివరించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు తో పాటు అనేక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డుల ఏర్పాటుతో పాటు రేడియల్ రోడ్లు, పరిశ్రమల కోసం ప్రత్యేక క్లస్టర్లు తీసుకురాబోతున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించారు.
శాంతిభద్రతలను పటిష్టంగా నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి పైన దృష్టి సారించినట్లు తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ లో ముందుకు వెళ్తున్నట్లు ఆయన వివరించారు. యువతలో నైపుణ్యాల పెంపు కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేశామన్నారు. ఐటీఐల ను ఏటీసీలుగా మార్చి విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పుతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24 గంటలు కష్టపడుతున్నారన్నారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి కోసం తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన రఘరామరాజన్ కు కోరారు. సులభతర వ్యాపారానికి అనుగుణంగా తెలంగాణ లో పరిస్థితులు ఉన్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఫార్మా, ఐటీ, డేటా సెంటర్ల కోసం కావాల్సిన మంచి వాతావరణం, వసతులు కల్పిస్తున్నట్లు ఆయన రఘురామ్ రాజన్ కు వివరించారు.
Read Also: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్ కు మహిళ సీఎం.. !
Follow Us On : WhatsApp

