కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) దుబాయ్లో చిక్కుకుపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తెలిపారు. దుబాయ్(Dubai) అంటే తనకు ఎంతో ఇష్టమని, ఎప్పుడూ సురక్షితంగా అనిపించే ఈ నగరంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం కలచివేస్తోందని తెలిపారు. తన గురించి ఆరా తీస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాను తన బృందంతో కలిసి దుబాయ్లోనే చిక్కుకుపోయామని, అయితే అందరూ సురక్షితంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో విమానాశ్రయం వద్ద తీవ్ర గందరగోళం నెలకొన్నట్లు చెప్పారు. ఇటీవల విమానాశ్రయం సమీపంలో పేలుడు సంభవించిందని, తమకు దగ్గరగా పొగ, ధూళి వ్యాపించడంతో తన కోచ్ వెంటనే ఆ ప్రదేశం నుంచి వెళ్లాలని చెప్పినట్లు తెలిపారు. దుబాయ్ విమానాశ్రయ సిబ్బంది, స్థానిక అధికారులు, దుబాయ్లోని భారత హైకమిషన్ అందిస్తున్న సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ, పరిస్థితులు చక్కబడాలని ఆశిస్తున్నామని సింధూ పేర్కొన్నారు.

