కలం, స్పోర్ట్స్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) కోర్టులో పంజా విసిరింది! సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్లో (Australian Open) ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మలేషియా ఓపెన్ 2026 తర్వాత ఈ సీజన్లో సింధు సెమీస్కు చేరడం ఇది రెండోసారి. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ ఆటగాడు చెన్ సు యును సింధు ఊచకోత కోసింది. కేవలం 27 నిమిషాల్లోనే 21-6, 21-9 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. అంతకుముందు మ్యాచ్లో తోటి భారత క్రీడాకారిణి ఇషారాణి బారువాను 22-20, 21-12తో ఓడించిన సింధు, అదే జోరును ఇక్కడా కొనసాగించింది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సింధుకు ఈ విజయం భారీ బూస్ట్ ఇవ్వనుంది.
మరోవైపు, టోర్నీలో సంచలన విజయాలతో దూసుకుపోయిన భారత యువ సంచలనం తన్వి శర్మ ప్రయాణం క్వార్టర్స్లోనే ముగిసింది. అంతకుముందు మాళవిక బన్సోద్ను 21-12, 21-15తో ఓడించి షాకిచ్చిన తన్వి, క్వార్టర్స్లో మాత్రం జపాన్ టాప్ సీడ్ అకానె యామగుచి చేతిలో 14-21, 14-21తో ఓడిపోయింది. పురుషుల డబుల్స్లో ఆస్ట్రేలియా జోడిపై గెలిచి క్వార్టర్స్ చేరిన హరిహరన్ – అర్జున్ జంట, దురదృష్టవశాత్తూ మ్యాచ్ మధ్యలోనే తప్పుకుంది.
ఇక సెమీఫైనల్లో అసలైన యుద్ధం జరగనుంది. ప్రపంచ ఛాంపియన్ అకానె యామగుచితో పీవీ సింధు తలపడనుంది. వీరిద్దరి మధ్య ఇది 29వ పోరు కాగా, హెడ్-టు-హెడ్ రికార్డుల్లో సింధు 15-13తో ముందంజలో ఉంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.

