కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం Khammam) నగరంలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్వోలు) పలు కీలక సూచనలు చేశారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే ప్రధాన లక్ష్యమని, ఓటర్ల జాబితా నుంచి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సరైన సమాచారాన్ని మాత్రమే నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ఎన్యూమరేషన్ ఫారాలు నింపే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వారికి పూర్తి స్థాయిలో సాంకేతిక సహాయం అందించాలని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమానికి ఖమ్మం నగర ప్రజలందరూ పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా నింపి, అవసరమైన ధృవీకరణ పత్రాలను జత చేసి నిర్దేశిత గడువులోగా అధికారులకు సమర్పించాలని కోరారు. ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియలో లేదా ఫారాలు నింపడంలో ఏవైనా సందేహాలు, ముఖ్యంగా పాత ఓటరు వివరాలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురైతే ఎలాంటి సంకోచం లేకుండా బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించి, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేందుకు పార్టీ ప్రతినిధులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

