కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘన వివాదం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్ ఆవరణలో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (SUDA) సుమారు రూ. 2 కోట్లతో చేపట్టనున్న హెలిప్యాడ్, ఉత్తర ద్వారం, మెయిన్ రోడ్డు, కొత్త కలెక్టరేట్ నుంచి ఈశాన్యం గేట్ వరకు రహదారి అభివృద్ధి, గార్డెన్ సుందరీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏంటని గంగుల కమలాకర్ అధికారులను నిలదీశారు.
ప్రతిపక్షంలో ఉన్నందుకేనా వివక్ష..
హెలిప్యాడ్, సర్వీస్ రోడ్డు ప్రారంభోత్సవ సమాచారం తనకు ఇవ్వకపోవడమేంటని పంచాయతీరాజ్ అధికారి సంపత్ రావుపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నామనే ఉద్దేశంతోనే అధికారులు ఇలా వివక్ష చూపిస్తున్నారా.. అని నిలదీశారు. అధికారులు ప్రోటోకాల్ పూర్తిగా విస్మరిస్తున్నారని, ఇలాంటివి మరోసారి పునరావృతం కాకూడదని గట్టిగా హెచ్చరించారు. గంగుల అసహనం వ్యక్తం చేసిన ఈ వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ పాల్గొన్నారు.

