కలం, వెబ్ డెస్క్: నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలకు సంబంధించి బీజేపీ విధానంలో లోపాలను ప్రజల ముందుంచడంతో పాటు ప్రత్యామ్నాయ సూచనలు చేసి దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు కృషి చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అభినందించారు. డీలిమిటేషన్పై ప్రత్యామ్నాయ సూచనలు భేష్ అని పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) శనివారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా దక్షిణ భారత దేశంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలను బలహీనపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రజాస్వామ్య విరుద్ధ రాజ్యాంగ సవరణను అడ్డుకోవడం.. దేశ భవిష్యత్తును కాపాడేందుకు ప్రతిపక్ష శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు మద్దతుగా నిలిచినందుకు తెలంగాణ ప్రజల తరఫున ప్రియాంక గాంధీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఆమోదం పొందిన మహిళా బిల్లుతో సంబంధం లేకుండా, మహిళా సాధికారత పేరుతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, అనవసరమైన డీలిమిటేషన్ అజెండాను ముందుకు తీసుకువచ్చారని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ సీఎంతో అన్నారు.

