కలం, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట (Narasannapeta Bus Fire ) సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. విజయవాడ నుంచి టెక్కలి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు నరసన్నపేట మండలం జమ్మూ జంక్షన్ జాతీయ రహదారి వద్దకు రాగానే మంటలు చెలరేగాయి. బస్సు వెనుక నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో అప్రమత్తమయ్యారు. వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు.
దీంతో డ్రైవర్, కండక్టర్ తో సహా ఆ సమయంలో బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు త్వరితగతిన బయటకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే, మంటలు వేగంగా విస్తరించడంతో ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చే లోపే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

