కలం, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్లో నెలకొన్న పరిస్థితులు పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెస్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయంగా ఉద్రిక్తతలు పెరగడం, అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దేశంలో మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇరాన్లో ఉన్న భారతీయ పౌరుల క్షేమం, భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని మోడీ స్పష్టం చేశారు. సరుకుల రవాణా, ఇంధన సరఫరా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలని ఆయన కోరారు. యుద్ధం దేనికీ పరిష్కారం కాదని.. చర్చలు, దౌత్యం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని మోడీ సూచించారు. శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

