కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా పీకే ఓసీ డీప్ సైడ్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని సింగరేణి సంస్థకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateswarlu) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి కోరారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్తో కలిసి శుక్రవారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ గని కేటాయింపులో సింగరేణి, తెలంగాణ జెన్కో మధ్య పోటీ నెలకొందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సింగరేణికే దక్కేలా చూడాలని ఎమ్మెల్యే, ఎంపీ విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం..
సుమారు 181 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు కలిగిన ఈ గని జీవితకాలం 20 సంవత్సరాలు అన్నారు. దీని ద్వారా సింగరేణి సంస్థకు రూ.1,500 కోట్ల మేర లాభం ఉంటుందని వివరించారు. ఈ గని సింగరేణికి కేటాయించకపోతే మణుగూరు ప్రాంత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందన్నారు.
దశలవారీగా గనులు మూతపడి వేలాది మంది కార్మికులు, లారీ యజమానులు, స్థానిక వ్యాపారులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందిస్తూ, ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

