కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో సంచలనం చోటుచేసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీస్ శాఖలో కదలికలు మొదలైనట్లు తెలుస్తోంది. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్ లో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం. విచారణ కూడా అక్కడే చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇందు కోసం ఇప్పటికే పలువురు అధికారులు ఎర్రవెల్లికి బయలుదేరారన్న వార్తలు రావడంతో కేసీఆర్ ఫామ్ హౌజ్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్, సిద్దిపేట, హైదరాబాద్ నుంచి చాలా మంది నేతలు ఎర్రవెల్లికి బయలుదేరినట్లు తెలుస్తోంది. దీంతో నిన్నా మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు ఇస్తారన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది.
ప్రధాన కేసుకు సంబంధించి కాకుండా పంజాగుట్టలో నమోదైన ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటికే పార్టీ పెద్దలు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను విచారించిన సిట్.. ఇదే కేసులో కేసీఆర్ను కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురినీ సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీస్ ఇచ్చి విచారించిన నేపథ్యంలో కేసీఆర్ కూడా అదే నోటీస్ ఇస్తారా..? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.


