కలం, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్లో భారత్తో జరిగే పోరుకు పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ టీమ్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోర్నీలో పాక్ టీమ్ పాల్గొనడానికి ఆ దేశ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. అందులోనే ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగే భారత్తో జరిగే మ్యాచ్లో పాక్ టీమ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వివరించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీష్తో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం సోషల్ మీడియా వేదిక ఎక్స్లో వెల్లడించింది. ICC వరల్డ్ T20 2026లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చామని, అయితే భారత్తో నిర్ణయించిన తేదీన జరిగే మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు ఆడదని స్పష్టం చేసింది.
ఇదివరకే పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. బంగ్లాదేశ్ వేదిక మార్పు అభ్యర్థనను ICC తిరస్కరించడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. జనవరి 25న మొహ్సిన్ నక్వీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కలిసి ఈ అంశంపై చర్చించారు. అన్ని అవకాశాలను పరిశీలిస్తూ తుది నిర్ణయం తీసుకుంటామని ఆ సమావేశంలో నిర్ణయించినట్టు వెల్లడైంది.జనవరి 24న ICC కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు వెళ్లేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించి, స్కాట్లాండ్ను స్థానంలోకి తీసుకుంది. ఈ పరిణామాలతో పాకిస్థాన్ భాగస్వామ్యంపై చర్చలు మరింత తీవ్రతరమయ్యాయి.
ICC T20 వరల్డ్కప్ 2026 ఫిబ్రవరి 7న భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానుంది. అదే రోజు పాకిస్థాన్ తన తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడనుంది. గ్రూప్–ఏలో పాకిస్థాన్తో పాటు అమెరికా, నమీబియా జట్లు ఉన్నాయి. హైబ్రిడ్ మోడల్ ప్రకారం పాకిస్థాన్ గ్రూప్ దశ మ్యాచ్లు శ్రీలంకలో నిర్వహించనున్నారు. మొత్తంగా చూస్తే, టోర్నీలో పాల్గొనాలన్న పాకిస్థాన్ నిర్ణయంతో స్పష్టత వచ్చినా, భారత్తో మ్యాచ్పై తీసుకున్న వైఖరి మాత్రం క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారి తీస్తోంది. తదుపరి పరిణామాలపై అంతర్జాతీయ క్రికెట్ వర్గాలు దృష్టి సారిస్తున్నాయి.


