కలం, వెబ్ డెస్క్: చేనేతను (Handloom Weavers) కాపాడడం అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమేమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. వారంలో కనీసం ఒక రోజు చేనేత దుస్తులు ధరించి.. నేతన్నకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. చేనేత ఒక వృత్తి మాత్రమే కాదని.. అది మన సంస్కృతి, మన వారసత్వ సంపదలో అంతర్భాగమని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘వోకల్ ఫర్ లోకల్‘ స్ఫూర్తితో జాతీయ చేనేత దినోత్సవ సంకల్పంలో భాగంగా ప్రతి భారతీయుడు చేనేత వస్త్రాలను ఆదరించాలని కోరారు. చేనేత కళాకారుడు నేసే ప్రతి నూలుపోగులో అతని శ్రమతోపాటు చిందించే స్వేదం, అతని కుటుంబ ప్రతిష్ట, జీవనం అల్లుకుని ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఏపీలో సుమారు 1.27 లక్షల మంది చేనేత కార్మికులు, వారి కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. అలాంటి చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మగ్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ.. “నేతన్న సేవలో” పథకం ద్వారా ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతున్నామని స్పష్టం చేశారు. పింఛన్లు, తక్కువ వడ్డీకే రుణాలు, సామాజిక భద్రతా పథకాల ద్వారా నేతన్నలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఉప్పాడ జాందానీ వంటి ప్రత్యేక గుర్తింపు కలిగిన చేనేత వస్త్రాలకు జీఐ (GI) గుర్తింపు సాధించామని వివరించారు.

