కలం, వెబ్ డెస్క్: కొందరు కిరాయి వక్తలు జనసేన (Jana Sena) పార్టీపై కుట్రలు చేస్తున్నారని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. గురువారం ఉదయం పవన్ జనసేన ముఖ్య నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీపై కొందరు దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
జనసేన కోసం పని చేస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకుల సేవలను పవన్ (Pawan Kalyan) ప్రశంసించారు. పార్టీ సంస్థాగత విషయాలపై పలువురు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో జనసేనపై దుష్ప్రచారం ఎక్కువగా జరుగుతోందని చెప్పారు. కొందరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత, కుల విభేదాలను పార్టీకి ఆపాదించడానికి కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి కుట్రలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను తీవ్రంగా ఖండించాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజా సేవే పరమావధిగా జనసేన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Read Also: బిడ్డను ఎత్తుకొని విధి నిర్వహణ.. కానిస్టేబుల్కు హోంమంత్రి సత్కారం
Follow Us On : WhatsApp


