కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి (Patancheru Govt Hospital) లో విద్యుత్ సరఫరా తరచూ నిలిచిపోవడంతో, లైట్లు లేక వైద్యులు మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులోనే రోగులకు చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొంది. సోమవారం ఉదయం నుంచే విద్యుత్ లేకపోవడంతో ఆసుపత్రిలోని వార్డులు, అత్యవసర విభాగాలు చీకట్లోనే ఉండిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆసుపత్రిలో జెనరేటర్ అందుబాటులో ఉన్నప్పటికీ, కరెంట్ పోయిన సమయంలో దాన్ని ఆన్ చేయకపోవడం గమనార్హం. అలాగే ఆసుపత్రి ఎలక్ట్రీషియన్ కూడా అందుబాటులో లేకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రి సిబ్బంది, అధికారుల తీరుపై రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

