కలం, కరీంనగర్: పంబాల కులస్థులకు (Pambala Community) వెంటనే కుల ధృవీకరణ పత్రాలు (Caste Certificates) జారీ చేయాలని డిమాండ్ చేస్తూ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు పంబాల కుల ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు తెలిపారు. కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు గుంటి నవీన్, రేతు రాహుల్, కొరిమి సూర్యుడు ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తూ జీవో జారీ చేసినప్పటికీ, వంబాల కులస్థులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా అధికారులు ఏడాది కాలంగా కాలయాపన చేస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ కులానికి చెందిన ‘చంద్రుడు’ అనే విద్యార్థి యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని.. మెయిన్స్ కోచింగ్ కోసం అంబేద్కర్ స్టడీ సర్కిల్ అధికారులు కుల ధృవీకరణ పత్రాన్ని అడుగుతున్నారని తెలిపారు. సర్టిఫికెట్ లేకపోవడం వల్ల విద్యార్థులు విద్యా, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, దుర్గమ్మలను తాము పూజిస్తామని.. పూజా విధానంలో జమడిక, సుత్తి, వంబజోడు, తాళాలు, వలక, వీరగోల వంటి పరికరాలను ఉపయోగిస్తామని వారు వివరించారు.
సిద్దిపేట, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ వంటి ఇతర జిల్లాల్లో వంబాల కులస్థులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారని.. కేవలం కరీంనగర్ జిల్లాలోనే అధికారులు ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంబాల కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు రేతు అనిల్, కొరిమి పృథ్వి, కొరిమి అశోక్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

