కలం, ఖమ్మం బ్యూరో: ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదల కన్నీళ్లు తుడవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 129 మంది లబ్ధిదారులకు రూ. 35,91,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, అలాగే మూడు కళ్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదలకు వైద్య ఖర్చుల భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధిని వేగంగా అందిస్తున్నామని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

