కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్లో (T20 World Cup) భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. భారత్తో ఆడటానికి ఓకే చెప్పిన పాక్.. కొన్ని షరతులు పెట్టింది. లాహోర్లో జరిగిన ఐసీసీ-పీసీబీ మధ్య జరిగిన భేటీ ఊహించని మలుపు తీసుకుంది. ఈ సమావేశంలో ఐసీసీకి చెందిన ఇద్దరు అధికారులు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం పాల్గొన్నారు. భారత్తో మ్యాచ్ ఆడబోమన్న పీసీబీ గత వైఖరే ఈ భేటీకి కారణమైంది. ఇందులో భారత్తో మ్యాచ్ ఆడాలంటే కొన్ని షరతులు ఉన్నాయని పాక్ అధికారులు తెలిపారు. మొదటిది.. ఐసీసీ ఆదాయాల్లో తమ వాటాను పెంచాలని పీసీబీ డిమాండ్ చేసింది. ఇది గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలకు పూర్తి భిన్నంగా మారింది. అంతేకాదు, మ్యాచ్కు ముందు, తర్వాత భారత ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది పాకిస్థాన్ జట్టుకు హ్యాండ్ షేక్ ఇవ్వాలని కోరింది. ఆసియా కప్ సమయంలో జరిగిన దృశ్యాలే ఈ డిమాండ్కు నేపథ్యంగా మారాయి.
ఇక్కడితో పీసీబీ (PCB) ఆగలేదు. భారత్–పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు మళ్లీ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా ఐసీసీను (ICC) కోరింది. అయితే ఇలాంటి నిర్ణయాలు బోర్డుల పరిధిలోనే ఉంటాయని, ఐసీసీకి ఇందులో పాత్ర లేదన్న వాస్తవం ఈ డిమాండ్కు అడ్డంకిగా నిలుస్తోంది. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే, పరిహారం అంశంలో ఐసీసీ చేతులెత్తేసినట్లే కనిపించింది. పూర్తి ఆదాయ వాటా తప్ప అదనంగా ఏమీ ఇవ్వలేమని ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ పరిణామాల మధ్య, ఐసీసీ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా పాకిస్థాన్కు స్పష్టమైన సూచన చేసినట్లు తెలుస్తోంది. భారత్ మ్యాచ్ బహిష్కరణను వెంటనే వెనక్కు తీసుకోవాలని, సమస్యలను ఐసీసీ ఆర్బిట్రేషన్ కమిటీ లేదా బోర్డు సమావేశంలో పెట్టాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత ఐసీసీ తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.
Read Also: సూర్యకుమార్ నాయకత్వంపై గంభీర్ ప్రశంసలు
Follow Us On : WhatsApp


