కలం, వెబ్ డెస్క్ : మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజ్యాంగానికి లోబడి ఏ పార్టీలో చేరినా తమకు అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న అంశంపై కిషన్ రెడ్డి స్పందించారు. అయితే దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి ‘ఆపరేషన్ కగార్’ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఇదే క్రమంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి కెసిఆర్ బ్రాండ్ కోసం, కెసిఆర్ రేవంత్ రెడ్డి బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం జరగడం లేదని విమర్శించారు. అసలు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా కాంగ్రెస్ నిలబెట్టుకుందా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం తెలంగాణకు చేసిన సాయంపై లెక్కలతో సహా తాను లేఖ రాస్తే, ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ నేత కూడా మాట్లాడలేదని కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. రాష్ట్ర ఖజానాలో లంకె బిందెలు లేవు, కేవలం ఖాళీ బిందెలే ఉన్నాయని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి పంపేందుకు వెయ్యి కోట్ల రూపాయల ఫండ్ ఎక్కడి నుండి తెస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలే ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం, ఇన్ని వందల కోట్లు ఎలా సమకూరుస్తుందో నిగ్గుతేల్చాలన్నారు. హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ దందాలు తప్ప మరేమీ సాగడం లేదని ఆయన ఆరోపించారు.
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లకు పట్టాలు, అనుమతులు ఇచ్చి, ఇప్పుడు ఉన్నట్టుండి పేదల ఇళ్లను ఖాళీ చేయమనడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని విమర్శించారు. ఐదు వేల కోట్ల బాపు ఘాట్ నిర్మాణం, లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్టు వెనుక భారీ కమిషన్ల వేట సాగుతోందని ఆయన ఆరోపించారు. ఈ ‘కమిషన్ల దందా’ను ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు.

