కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ (TG University) పరిపాలన భవనం ముందు నాన్-టీచింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, ఆల్ ఇండియా యూనివర్సిటీ జేఏసీల పిలుపుమేరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి. సాయ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ఫిట్మెంట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి సీపీఎస్ను రద్దు చేయాలని కోరారు.
ఇంకా పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నాన్-టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

