కలం, సూర్యాపేట : తుంగతుర్తి (Thungathurthi) నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, అధిష్ఠానం ప్రకటించిన వారే ఆయా పదవుల్లో కొనసాగుతారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు (Mandula Samuel) స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆమోదంతో నియోజకవర్గ పరిధిలోని 9 మండలాలకు ప్రకటించిన అధ్యక్షుల నియామకంపై వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు.
“నేను ఇక్కడ ఉన్నంతవరకు కొత్తగా ఎన్నికైన మండల అధ్యక్షుల మార్పు అనేది ఉండదు. అధిష్ఠానం నిర్ణయించిన వారే తమ పదవుల్లో కొనసాగుతారు” అని ఎమ్మెల్యే మందుల సామేలు తేల్చి చెప్పారు. పార్టీ నిర్ణయాల విషయంలో తాను ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పార్టీలో కొత్త, పాత అనే తేడాలు లేకుండా అందరినీ కలుపుకొని, సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో నాయకులంతా విభేదాలు వీడి, పరస్పర సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో కృషి చేయాలని పేర్కొన్నారు.

