కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఏళ్లుగా విధులకు గైర్హాజరవుతున్న 94 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. అందులో నిజామాబాద్ మెడికల్ కాలేజీ (Nizamabad Medical College) కి చెందిన ఏడుగురిపైనా వేటు పడింది. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగిస్తూ డీఎంఈ నరేంద్ర కుమార్ (Narendra Kumar) ఉత్తర్వులు జారీ చేశారు. 2022 నుంచి 2024 మధ్య వీరు విధుల్లో చేరారు. వీరంతా వివిధ ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడంతో విధులకు డుమ్మా కొడుతున్నారు.
ముందస్తు అనుమతి తీసుకోకుండా విధులకు ఎగనామం పెట్టడంతో.. గతంలోనే వీరికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ మార్పు రాలేదు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అయేషా పర్హీన్, డాక్టర్ జి స్రవంతి, డాక్టర్ పి నిశిత, డాక్టర్ నీలకంఠం సతీష్ రాజు, డాక్టర్ ఆర్ లక్ష్మణ్, డాక్టర్ ఎం అపూర్వ, డాక్టర్ పి లీలావతిలను తొలగిస్తూ డీఎంఈ తాజాగా ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో వేటుకు గురైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు(Assistant Professors) అంతా షాక్ కు గురయ్యారు. ఏమీ కాదులే నడుస్తుందిలే అనుకున్న పరిస్థితులు నిర్లక్ష్యానికి కారణంగా ఉన్నతాధికారులు భావించే ఈ వేటు వేసినట్టు తెలుస్తుంది.
Read Also : మెడిసిన్ విద్యార్థులు మానవత్వంతో వైద్యం అందించాలి: మంత్రి కోమటిరెడ్డి
Follow Us On: Pinterest

