కలం, నిజామాబాద్ బ్యూరో: గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నవీపేట మండలం యంచ వద్ద పుష్కర ఘాట్ (Yamcha Pushkar Ghat) నిర్మాణానికి నిధులు మంజూరైన నేపధ్యంలో కలెక్టర్ మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి అనువైన స్థలం కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో ముఖాముఖి భేటీ అయి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
యంచ గ్రామ శివారులో ఎక్కడ పుష్కర ఘాట్ ఏర్పాటు చేస్తే భక్తులకు అనుకూలంగా ఉంటుందనే దానిపై చర్చించారు. అవసరమైన స్థలం అందుబాటులో ఉందా? రవాణా వసతి, ఇతర సదుపాయాలు, భద్రతాపరమైన అంశాలు తదితర వాటి గురించి సంబంధిత అధికారులను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అన్ని అంశాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వం నిర్ధారణ చేసిన ప్రాంతంలోనే పుష్కరఘాట్ నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.
పరిశీలన జరిపిన ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఏమేరకు అందుబాటులో ఉంది, పట్టా భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయన్నది పక్కాగా సర్వే నిర్వహించి వారం రోజుల్లోపు మార్కింగ్ పూర్తి చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించేలా ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా, విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట రెవెన్యూ, ఇరిగేషన్, ఎండోమెంట్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.

