కలం, నిజామాబాద్ బ్యూరో : లేఅవుట్ ప్లాట్లలో కేటాయించిన ఓపెన్ స్పేస్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తూ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం మండల పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం 10 శాతం కేటాయించిన ఓపెన్ స్పేస్లు, పార్కులు, ఇతర సామూహిక వినియోగ స్థలాలను పరిరక్షించడం స్థానిక సంస్థల బాధ్యత అని తెలిపారు. ఈ ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు (Illegal Constructions) జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎం.పీ.ఓలకు ఆదేశించారు.
నిబంధనలు అతిక్రమించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించకూడదని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి మండలంలో ఓపెన్ స్పేస్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, ఎక్కడైనా ఆక్రమణలు గుర్తిస్తే వెంటనే నోటీసులు జారీ చేయాలని చెప్పారు. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ (Collector Ila Tripathi) ఆదేశించారు. పాములు, తేళ్లు వంటి విషకీటకాల ప్రమాదం నివారించేందుకు పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను తొలగించాలని సూచించారు.
అలాగే నిరుపయోగంగా ఉన్న పాడుబడిన బావులను పూడ్చివేయాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ఎం.పీ.ఓలు, పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావుతో పాటు అన్ని మండలాల ఎం.పీ.ఓలు పాల్గొన్నారు.
Read Also: ఈ రోజు రాత్రి ఇరాన్పై దాడి.. ట్రంప్ సంచలన ప్రకటన
Follow Us On: Instagram

