కలం, వెబ్ డెస్క్: డబ్బులున్న వాళ్లు సంక్షేమ పథకాల కోసం ఆశ పడవద్దని, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి పథకాలు అందించి ఆదుకుంటే వారి స్థితిగతులు మారే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. అప్పుడే వారి జీవితాలు మారి సమాజంలో మార్పు కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో తక్కువ ఆదాయం వచ్చే వాళ్లను ఆదుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నేడు కృష్ణా జిల్లాలోని గుడివాడ (Gudivada) లో నిర్వహించిన స్వర్ణాంధ్రా-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. కృష్ణా జిల్లా ఎంతోమంది మహామహులు పుట్టిన నేల అని సీఎం కొనియాడారు. ఇక్కడి వారు చదువుకొని దేశ విదేశాలకు వెళ్లారని, అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారని చెప్పారు.
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో చెత్త లేకుండా చేస్తామని సీఎం చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టించి చూపిస్తామని సీఎం అన్నారు. చెత్త సేకరించే ఎలక్ట్రిక్ ఆటోలను సీఎం ప్రారంభించారు. ఆగస్ట్ 26 నాటికి 1140 ఆటోలు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఇక ఇటీవల ఎన్నికల్లో ప్రజలు చెత్తనంతా క్లీన్ చేశారన్నారు. కొంతమంది నోర్లను ఫినాయిల్ వేసి శుభ్రం చేశారన్నారు. ఇంకా రాజకీయాల్లో కొంతమంది క్రిమినల్స్ ఉన్నారని, వాళ్లు మారరని చెప్పారు.
కుట్రలు, కుతంత్రాలు చేస్తూ, ఆడవాళ్ల మీద సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా డిప్యూటీ సీఎం కుటుంబంపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వాళ్లు చేసేది తప్పు అని చెప్తే దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ప్రజలను కాపాడుకునేందుకు తాను ఎన్ని దాడులైనా భరిస్తానని సీఎం అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ట్రాక్ చేసి, సెకన్లలో శిక్షలు వేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

