కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంచార జాతుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ పాల్గొని మాట్లాడారు. వెనుకబడిన సంచార, విముక్త తెగల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. సంచార జాతుల పిల్లలకు నాణ్యమైన విద్యనందించడంతోపాటు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందనన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వాలు అందించే పథకాలను వినియోగించుకోవాలని తెలిపారు. సంచార జాతుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రాథోడ్ రమేశ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

