కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 1 లక్షా 58 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి, గోదాములకు తరలించినట్లు వివరించారు. 1 లక్షా 75 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులు, గోదాములకు తరలించినట్లు పేర్కొన్నారు. 30 వేల మెట్రిక్ టన్నుల జొన్న పంట దిగుబడి రాగా, ఇప్పటికే 20 వేల మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేశామని, మిగిలిన ధాన్యాన్ని మరో మూడు రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేస్తామని తెలిపారు.
పంట కొనుగోలుకు సంబంధించి, డబ్బులను ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయగలిగామని కలెక్టర్ చెప్పారు. రానున్న పంట కాలానికి సంబంధించి రైతులకు ఎరువుల కొరత రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులు ఎవరూ కూడా యూరియా లభ్యతపై ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని, ప్రస్తుతం 10734 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు.
రైతులు వారి అవసరాన్ని బట్టి బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఎరువుల దుకాణం వద్ద ప్రత్యేకంగా ఒక పోస్టరును అందుబాటులో ఉంచుతామని, ఇందులో ఎరువుల ధరలు, తదితర వివరాలు ప్రదర్శించబడతాయని అన్నారు. రైతుల వద్ద ఎరువుల కోసం అధిక ధరలు వసూలు చేస్తే, 8977751754 నంబరును సంప్రదించవచ్చునని వివరించారు. ఎరువుల దుకాణదారులు, రైతుల వద్ద నుంచి అధిక డబ్బులు తీసుకోరాదని హెచ్చరించారు. అధిక డబ్బులు తీసుకునే దుకాణదారులపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇప్పటికే అధిక ధరలకు ఎరువులను విక్రయించిన పలు దుకాణదారులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

