కలం, నల్లగొండ బ్యూరో : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) శాసనసభ విప్గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. నకిరేకల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న వేముల వీరేశం ఉమ్మడి నల్లగొండ రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. రాష్ట్రస్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వీరేశం.. 2018 ఎన్నికల్లో సొంత పార్టీ నేతలు తెర వెనక రాజకీయాలు నడపడంతో తృటిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఎస్సీ కోటాలో మంత్రి అవుతారనే ప్రచారం జరిగినా పార్టీలోని కొన్ని సోషల్ ఈక్వేషన్స్, జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం తదితర కారణాలతో మంత్రి కాలేకపోయారు.
వేముల వీరేశం (Vemula Veeresham) ప్రభుత్వ విప్గా నియమితులవ్వడంతో నకిరేకల్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండడం.. నిత్యం ప్రజల్లో కలిసిపోవడం వీరేశం ప్రత్యేకత. వేముల వీరేశం పార్లమెంటరీ రాజకీయాల్లోకి రాకముందు వామపక్ష భావజాలంతో నడిచిన విప్లవ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ (ప్రస్తుత బిఆర్ఎస్) పార్టీలో చేరి.. నకిరేకల్ నియోజకవర్గంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపారు. ఉద్యమకారుడికి ప్రభుత్వ విప్ పదవి దక్కడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమైంది.
Read Also: నేను ఏ పార్టీలో ఉన్నా.. రైతుల గురించే ఆలోచిస్తా : మంత్రి తుమ్మల
Follow Us On : WhatsApp

