పేదల సొంతింటి కల నిజం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం

కలం, నల్లగొండ బ్యూరో: పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu) నిర్మించి, సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం చిట్యాల మండలం గుండ్రంపల్లి, పెదకాపర్తి గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇండ్లు మంజూరు కాగా, అందులో 300కి పైగా ఇళ్లను ఇప్పటికే ప్రారంభించామని ఎమ్మెల్యే గుర్తుచేశారు.

రాష్ట్రంలో తొలి విడతగా నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. త్వరలో రెండో విడత ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో పూర్తైన డబుల్ బెడ్రూం ఇండ్లను సైతం కలెక్టర్ సహకారంతో అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. రానున్న రెండేండ్లలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పించడం లక్ష్యమని స్పష్టం చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ గృహవసతి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోనే 348 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి సిద్ధం చేసినట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేసి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ పీడీ రాజ్ కుమార్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, తహసీల్దార్ విజయ, ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి, హౌసింగ్ డీఈ అబ్దుల్ వాజిద్, హౌసింగ్ ఏఈ ప్రీతి, సర్పంచ్ కాటం వెంకటేశం పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>