కలం, నిర్మల్: గత రెండున్నరేళ్లలో ముధోల్ నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Rama Rao Patel) అన్నారు. నర్సాపూర్ (జి) మండలం గొల్లమాడ (Gollamada) గ్రామంలో మంగళవారం రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీరప్ప ఆలయానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గొల్లమాడ గ్రామ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.1.64 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. గ్రామంలోని పెద్ద చెరువు మరమ్మతులకు రూ.24 లక్షలు, గోదాం నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
కుంటాల–గొల్లమాడ రహదారి నిర్మాణానికి రూ.25 కోట్ల నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే ఆ నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా గొల్లమాడ గ్రామంలో నెలకొన్న తక్కువ వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.

