కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ప్రజల డబ్బులతో లండన్లో ఎంఐఎం ఎమ్మెల్యే ఇంట్లో జరిగే పెళ్లికి వెళ్లారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) విమర్శించారు. ప్రజా ధనం వృథా చేసే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు. అలాగే, అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం కూడా సాధారణమైన విషయం కాదన్నారు. దీనిపై ఇంకా కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ వివరణ ఇవ్వలేదన్నారు. దేశంలో ఏ సీఎం అమెరికాకు వెళ్లినా ఇలా అనుమతి నిరాకరించినా పరిస్థితి లేదన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై తమకు అనుమానం కలుగుతోందన్నారు. రేవంత్కు పాస్పోర్టును కూడా ఏసీబీ కోర్టు రెండు వారాల కిందటే ఇచ్చిందన్నారు. సీఎం విదేశాలకు వెళ్లాలంటే.. కోర్టును ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఉందని అర్వింద్ ఎద్దేవా చేశారు.
కాలేజీలు మూతపడే పరిస్థితి..
తెలంగాణలోని కాలేజీలకు ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో అవన్నీ మూతపడే పరిస్థితి వచ్చిందని ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని అవమానపరిచారని, ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసేలా కొత్త స్కీమ్ తెచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఇంకా ప్రమాదకరమని తానెప్పుడో చెప్పానని, అదిప్పుడు రుజువు అవుతోందన్నారు. రేవంత్ రెడ్డిని సగం మంది మంత్రులు, ఎంతో మంది ఎంపీలు తిడుతుంటారని.. వారు ఎవరెవరో తనకు తెలుసన్నారు.

