కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు యశ్వంత్ (Mountaineer Yashwanth) లడఖ్లోని కోర్జోక్ శ్రేణిలో ఉన్న 6,115 మీటర్ల ఎత్తున్న మౌంట్ నోమాడ్ శిఖరంతో పాటు, 6,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న మరొక శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఈ సాహసయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఇందులో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand)కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ యాత్రలో ఎదురైన సవాళ్లను యశ్వంత్ (Mountaineer Yashwanth) వివరిస్తూ బేస్ క్యాంప్ వద్ద తనకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఎత్తు ప్రదేశాల వల్ల కలిగే అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించారు. ఆ సమయంలో తన ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకరంగా 66 శాతానికి పడిపోయాయని పేర్కొన్నారు. అయినప్పటికీ పట్టుదలతో కోలుకొని మిగిలిన రెండు శిఖరాల అధిరోహణను విజయవంతంగా పూర్తి చేశానని చెప్పారు. శిఖరాగ్రాన భారత జాతీయ పతాకంతో పాటు సీవీ ఆనంద్ ఫొటో సగర్వంగా ప్రదర్శించి తన గౌరవాన్ని చాటుకున్నట్లు తెలిపారు. సీవీ ఆనంద్ అందించిన మద్దతు, ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే తాను ఈ ఘనత సాధించగలిగానని యశ్వంత్ ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయాల్లో ఆయన తనపై ఉంచిన నమ్మకమే ముందుకు సాగే శక్తిని ఇచ్చిందని, ఈ విజయం కేవలం తనది మాత్రమే కాదని, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరిదని ఆయన పేర్కొన్నారు.
Read Also: అర్జెంటీనా నుంచి వచ్చి యోగాసనంలో డబుల్ గోల్డ్
Follow Us On : WhatsApp

