కలం, క్రైమ్ బ్యూరో : మొయినాబాద్ ఫాంహౌజ్ మహిళల జంట హత్యల కేసు (Farmhouse Murder Case)లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకుండా అప్పిచ్చిన వారిని అతి దారుణంగా హత్య చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఇందిరమ్మ కాలనీలో నివసించే చెందిన ఆబేదాబేగం, మహబూబాబీ ముగ్గరు వ్యక్తులకు అప్పు నిమిత్తం డబ్బులు ఇచ్చారు.. ఈ క్రమంలో తిరిగి డబ్బులు చెల్లించాలని వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో అబేదాబేగం, మహబూబాబీ లను అడ్డుతొలగించాలని నిందితులు కరీమాబేగం, రహమాన్, నయీంలు ప్లాన్ చేశారు. వీరితో పాటు డబ్బులిచ్చిన మరో ఆరుగురిని కూడా అంతమొందించాలని ప్లాన్ చేశారు.
అప్పు డబ్బులు ఇస్తామని నమ్మించిన ముగ్గురు నిందితులు.. మొదట మహబూబాబీని మొయినాబాద్ సమీపంలోని తోల్కట్ట వద్ద ఉన్న ఫౌంహౌస్ వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడే గుంత తీసి ఆమెను పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఆబేదాబేగంను పిలిచిన నిందితులు.. అదే ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి పాతిపెట్టారు. మిగిలిన వారిని కూడా ఇలాగే చంపేయాలని భావించినా.. వారు రాకపోవడంతో వీరి ప్లాన్ బెడిసికొట్టింది.
పోలీసులు కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నారు. విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారు చెప్పిన ప్రాంతంలో తవ్వకాలు చేపట్టగా మొదట మహబూబాబీ అస్థిపంజరం కుళ్లిపోయిన స్థితిలో బయటికి వచ్చింది. ఆ తర్వాత ఆబేదాబేగం మృతదేహాన్ని కూడా బయటికి వెలికితీశారు. ఆ తర్వాత నిందితులను విచారణ చేయగా.. అప్పు ఇచ్చిన మరో ఆరుగురు మహిళలకు కూడా అదే రకంగా చంపేందుకు ప్లాన్ చేసినట్లు నిందితులు వెల్లడించారు.

