కలం, వెబ్డెస్క్: జెన్ జీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) సపోర్టుగా నిలిచారు. ఆందోళనలు చేసినంత మాత్రానా వాళ్లను యాంటీ నేషనల్స్ అని ముద్ర వేయడం కరెక్టు కాదన్నారు. తమ తరంతో పోలిస్తే జెన్ జీలో నిజాయతీ, దేశభక్తి ఎక్కువని చెప్పారు. ఇండియా ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్ (ఐఐఎంయూఎన్) గురువారం ముంబైలో నిర్వహించిన కాన్ఫరెన్స్లో మోహన్ భగవత్ మాట్లాడారు. ‘‘ఆందోళనలు, నిరసనలు చేసినంత మాత్రానా యువత దేశద్రోహులు కారు.. వాళ్లంతా మన పిల్లలే.. మన భవిష్యత్ తరం. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. ప్రజాస్వామ్యంలో నిరసనలు కూడా భాగమే. విద్యావ్యవస్థలో మార్పులు, సంస్కరణల కోసం యువత రోడ్లపైకి వచ్చారు. దానికి పరిష్కారం చర్చలే” అని పేర్కొన్నారు. ‘‘నాకు జెన్ జీపై నమ్మకం ఉంది. మా తరంతో పోలిస్తే జెన్ జీ, జెన్ ఆల్ఫాలో నిజాయతీ ఎక్కువగా ఉన్నది. వాళ్లంతా దేశం విషయంలో నిజాయతీగా కొట్లాడుతున్నారు.. దేశభక్తి, కమిట్మెంట్తో ఉన్నారు” అని చెప్పారు.
ప్రశ్నించే గుణం..
= ఇప్పటి తరంలో ప్రశ్నించే గుణం ఎక్కువని మోహన్ భగవత్ అన్నారు. ‘‘మేం యూత్ స్టేజ్లో ఉన్నప్పుడు పెద్దలు, అధికారులు చెప్పింది వినేది.. తిరిగి ప్రశ్నించేది కాదు. కానీ జెన్ జీ అలా కాదు.. ఎవరినైనా ప్రశ్నిస్తున్నారు. వాళ్లకు కావాల్సింది సమాధానం. ప్రశ్నించే హక్కు యువతకు ఉంది” అని పేర్కొన్నారు.
= విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని భగవత్ అన్నారు. ‘‘విద్య అనేది వ్యాపారం కాదు.. అది సమాజ బాధ్యత. విద్యా రంగానికి బడ్జెట్లో 6 శాతం కేటాయించాలనే డిమాండ్ ఇప్పటికీ సమంజసమైనదే’’ అని పేర్కొన్నారు.
= సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నిరోధించడానికి కేవలం చట్టాలు సరిపోవని భగవత్ అన్నారు. నెటిజన్ల వైఖరిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతంగా నడుచుకునే రోల్ మోడల్స్ సమాజానికి అవసరమన్నారు.

