కలం, నకిరేకల్: నకిరేకల్ (Nakrekal) మున్సిపాలిటీ పరిధిలోని 5, 16, 18, 19, 20వ వార్డులకు చెందిన మహిళలకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం (MLA Vemula Veeresham) ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, పట్టణ మహిళలకు చీరలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
నకిరేకల్ పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.21 కోట్లతో డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. పట్టణంలోని పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు 800 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నకిరేకల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే, నకిరేకల్కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా మంజూరైందని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేమితో ప్రజలకు ఉపయోగపడలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
“ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి చీరలు, ఇందిరమ్మ ఇళ్ళు వంటి పథకాలతో మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” అని వేముల వీరేశం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

