కలం, వనపర్తి: ఇందిరమ్మ రాజ్యంతోనే గిరిజనుల సమగ్ర అభివృద్ధి సాధ్యమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) అన్నారు. గోపాల్ పేట మండలం కర్ణమాయకుంట తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం ప్రారంభించారు. పంచాయతీ భవనం అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాదని, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే కేంద్రంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు చేసేందుకు గ్రామస్థాయిలో పటిష్ఠ పరిపాలన అవసరమని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తండాలు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ప్రాంతాలు బలోపేతమవుతాయన్నారు. కర్ణమాయకుంట తండాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తలుపునూరులో గోదాములు ప్రారంభం..
రేవల్లి మండలం తలుపునూరులో నూతనంగా నిర్మించిన గోదాములను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన గాజుల కృష్ణయ్య నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొని, లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు పండించిన పంటలను భద్రపరుచుకుని, మార్కెట్లో అనుకూల ధరలు లభించే వరకు నిల్వ చేసుకునేందుకు గోదాములు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడితే రవాణా, నిల్వ, మార్కెటింగ్ పరంగా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ ఎక్కే వెంకటేష్, వైస్ ఛైర్మన్ సత్యశీలా రెడ్డి, సింగిల్విండో ఛైర్మన్ లోడే రఘు, సర్పంచి గౌండ్ల పావని, ఉప సర్పంచి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

