కలం, పెద్దపల్లి: పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండం మండలం గోదావరిఖనిలోని జీడీకే-11 ఇంక్లైన్ గనిపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి. మల్లికార్జున్ పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ (MLA Makkan Singh Raj Thakur) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన పి. మల్లికార్జున్, వారి సతీమణిని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
మల్లికార్జున్ సింగరేణి సంస్థలో విధులు నిర్వహించిన కాలంలో కార్మికుల సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేసిన సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు గనిపై ఉన్న మైసమ్మ తల్లికి ఎమ్మెల్యే మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగరేణి కార్మికులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

