కలం, వనపర్తి: పరిసరాల పరిశుభ్రతపై కలెక్టర్ ఆదర్శ్ సురభి దృష్టి సారించారు. పురపాలికల్లో దోమల వ్యాప్తికి కారణమయ్యే నీటి నిల్వలను వెంటనే తొలగించి, డ్రైనేజీలు, కాలువలు, పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని వనపర్తి జిల్లా కలెక్టర్ (Wanaparthy Collector) ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని తెలుగువాడ ప్రాంతంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కాలనీలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులు, పరిశుభ్రత చర్యలను పరిశీలించిన కలెక్టర్.. ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. దోమల పెరుగుదలకు దారితీసే నీటి నిల్వలను పూర్తిగా తొలగించడంతో పాటు డ్రైనేజీలు, కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. కాలనీలు, వీధుల్లో చెత్త పేరుకుపోకుండా సకాలంలో తొలగించి పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.
పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణతో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, ఆరోగ్యశాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

