కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కొత్తకోట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు సమష్టిగా పని చేసి విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (Madhusudan Reddy) సూచించారు. మంగళవారం కొత్తకోట (Kothakota) లో సీఎం సెక్యూరిటీ ఎఎస్ఎల్ కార్యక్రమానికి సీఎం స్పెషల్ సెక్యూరిటీ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
కొత్తకోట సంత వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వరకు ఎఎస్ఎల్ కాన్వాయి నిర్వహించిన అనంతరం పాఠశాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యాశాఖపై ఉన్న ప్రత్యేక దృష్టి కారణంగా కేవలం ఒక పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి విచ్చేస్తున్నారని, ఈ ప్రభుత్వ కార్యక్రమానికి అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని అధికారులను కోరారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ హెలిప్యాడ్ ఏర్పాటు, బారికేడింగ్ బాధ్యతలను ఆర్ అండ్ బి అధికారులకు బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేశారు. వేదిక, విద్యార్థులను తీసుకురావడం, పద్ధతిగా కూర్చోబెట్టడం జిల్లా విద్యా అధికారికి బాధ్యతలు అప్పగించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లైవ్ కవరేజీ వంటివి చూసుకోవాలని సమాచార శాఖ అధికారిని ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో రాజీ లేకుండా చూసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ కంట్రోల్, వేదిక వద్ద ముఖా ముఖి కార్యక్రమం సజావుగా జరిగే విధంగా పోలీస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించే విధంగా చూడాలని పోలీస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, సీఎం సెక్యూరిటీ ఇంచార్జి శ్రీధర్, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.
Read Also: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సివిల్స్ కోచింగ్!
Follow Us On: X(Twitter)

