కలం, ఖమ్మం బ్యూరో: మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవడమే ప్రధాన లక్ష్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర కల్పించాలనే ఉద్దేశంతో నియోజకవర్గ పరిధిలో రెండు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేశామన్నారు. రైతులు తమ పంటను దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని కోరారు. రైతుల ఇబ్బందులను గమనించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్రాలను మంజూరు చేయించామని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తూకం, నగదు చెల్లింపుల విషయంలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ నియోజకవర్గ రైతాంగానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ శిరీష, ఆర్ఐ కృష్ణ, సీపీఐ మండల కార్యదర్శి దీటి లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.

