కలం, మునుగోడు : గత పాలకుల పాలనలో ప్రజా సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే స్వేచ్ఛ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఉండేది కాదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేస్తున్న 357 మంది అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు మొబైల్ ఫోన్లను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన పంపిణీ చేశారు.
అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు సమాజంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారు చిన్నారులను కన్నతల్లుల్లా కాపాడుతూ సేవలందిస్తున్నారని, వారి సేవలు అమూల్యమని కొనియాడారు. అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి వారి సంక్షేమం పట్ల పూర్తి బాధ్యత ఉందని పేర్కొన్నారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ను పరిశీలించిన ఎమ్మెల్యే, స్వయంగా తయారుచేసిన ఆహార పదార్థాలను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Read Also: BRSలో చేరిన అనంతరం జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్
Follow Us On: X(Twitter)

