కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగరంలోని టేకులపల్లి కేసీఆర్ టవర్స్లో దారుణం చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలిక అఘాయిత్యానికి బలైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా, మహిళా సంఘాల ఆగ్రహానికి కారణమైంది. స్థానికుల కథనం ప్రకారం.. సుమారు వారం రోజుల క్రితం కేసీఆర్ టవర్స్లోని ఓ బ్లాక్లో నివసిస్తున్న మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఎలుకల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం బాలిక పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదం అలముకుంది.
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిపై బాధిత కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ అంశంపై ఖమ్మం హవేలీ సీఐ భాను ప్రకాష్ను వివరణ కోరగా.. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, సమగ్ర విచారణ జరిపిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘోరంపై సీపీఎం, వివిధ మహిళా సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు జరిపి, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

