కలం, సత్తుపల్లి : తన అభిమాన నాయకుడిని చూడాలన్న ఆశ తీరిన కొద్దిరోజులకే ఆ యువకుడి ప్రాణాలు అనంతలోకాలలో కలిసిపోయాయి. సత్తుపల్లి మండలం రామచంద్రరావుబంజర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బన్నె మణికంఠ యాదవ్ బోన్ క్యాన్సర్తో మృతి చెందగా, బుధవారం ఆయన అంత్యక్రియల్లో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (Sandra Venkata Veeraiah) పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. కేటీఆర్ను కలవాలన్న మణికంఠ కోరిక మేరకు తాను ఇటీవల చొరవ తీసుకుని వీడియో కాల్ ద్వారా మాట్లాడించానని, కేటీఆర్ కూడా ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. కానీ ఇంతలోనే మణికంఠ కన్నుమూయడం తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం నూతనకల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బలవంతపు లోకేశ్వరరావు తల్లి గోపమ్మ భౌతికకాయానికి సండ్ర పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమాల్లో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

