కలం, మెదక్ బ్యూరో : ప్రజలతో కలిసి పనిచేస్తూ వారి సమస్యలను తెలుసుకుని, వాటిని ప్రణాళికాబద్ధంగా పరిష్కరించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక (Praja Palana Pragathi Pranalika) కార్యక్రమంను తీసుకొచ్చారని మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkatswamy) అన్నారు. మెదక్ (Medak) కలెక్టరేట్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సన్నాహక సమావేశంను నిర్వహించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణలో ఉమ్మడి మెదక్ జిల్లాను మొదటి స్థానంలో ఉండేలా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని అన్నారు. 99 రోజుల ప్రణాళికను అమలు చేసే భాద్యత అధికారులదే అని తెలిపారు.
వేసవికాలంలో త్రాగునీరు సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అవసరమైన ప్రాంతాలలో బోర్ల రిపేర్లు, ప్రత్యామ్నాయ తాగునీరు సరఫరాకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు. అసెంబ్లీలో చర్చించి త్రాగునీరు సమస్య రాకుండా కావలసిన తాత్కాలిక పనుల కోసం అనుమతులు తీసుకుంటాం. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 10 థీమ్స్ లలో రూపొందించిన కార్యక్రమాలను ఆయా శాఖల ద్వారా పకడ్బందీగా నిర్వహించాలని, వాటితో పాటు 99 రోజుల ప్రణాళికను అన్ని శాఖలచే పక్కాగా నిర్వహించాలని సూచించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో 6 గ్యారంటీలు ప్రజలకు పూర్తిగా అందేలా చూడాలని, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులచే గృహప్రవేశాలు చేయించాలని అన్నారు. ఈ సన్నాహక సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జహీరాబాద్, సురేష్ షేట్కార్, మెదక్ ఎమ్మెల్యే మైనాంపల్లి రోహిత్ రావునారాయణ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గా రెడ్డి, మెదక్,సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లా అధికారులు పాల్గొన్నారు.

