కలం, మెదక్ బ్యూరో: ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే క్రమంలో పొరపాట్లు జరగకుండా చూసే బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ల పై ఉందని, ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలని మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) బీఎల్ఏలకు ఆదేశాలు జారీ చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలో ‘సర్’ ప్రక్రియపై అవగాహన సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జి నీలం మధు, పటాన్ చెరు ఇంచార్జి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ‘సర్’ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా మార్పులు చేర్పులు జరగాలని సూచించారు. మరణించిన వారి పేర్లు, ఒకే పేరుతో రెండు చోట్ల ఉన్న బోగస్ ఓట్లను గుర్తించి జాబితాను ప్రక్షాళన చేయాలని అధికారులకు, ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అలాగే 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో కూడా ఈ ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించి, తమ ఓటు వివరాలను సరిచూసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

