కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, అభివృద్ధి జాతర కొనసాగిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. శుక్రవారం ఖమ్మం(Khammam) జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం (Dammaigudem)లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Anudeep Durishetty) తో కలిసి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల మూడు నెలలు గడిచిందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలలో రోడ్లు, డ్రైయిన్లు ఇతర మౌళిక వసతుల కల్పన పనులు ప్రాధాన్యతతో చేపట్టామని, క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 99 రోజుల కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. దమ్మాయిగూడెం (Dammaigudem) గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్య శనివారం వరకు పరిష్కారం అవుతుందని అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే నూతన రేషన్ కార్డులు జారీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా వంటి అనేక హామీలను అమలు చేసిందని తెలిపారు. ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇళ్ళు ప్రజలకు మంజూరు చేస్తామని, రాబోయే మూడు సంవత్సరాలలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు అందించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుందని మంత్రి తెలిపారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా దమ్మాయిగూడెం గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి తెలిపారు.

