కలం, ఖమ్మం బ్యూరో: దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి పనులు షురూ అయ్యాయి. రూ. 14 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో రెండున్నర కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారిగా విస్తరణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti), ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ అంకిత్తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 50 లక్షలతో మంచికంటి నగర్లో సీసీ రోడ్డు పనులు, మరో రూ. 50 లక్షలతో పోస్టాఫీస్ సెంటర్ నుంచి గోదుమవాగు వరకు సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులకు పొంగులేటి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాల్వంచలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు, రిజిస్ట్రేషన్ వివాదాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. సింగరేణి పరివాహక ప్రాంతాల జీవో–76 అంశంపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల స్పష్టత ఇస్తుందని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పేరును “కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్”గా మార్చే ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. జిల్లాకు యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, బైపాస్ రోడ్డు, 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం లాంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్, కమిషనర్ సుజాత, అడిషనల్ కలెక్టర్ విద్యా చందన, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

