కలం, వెబ్ డెస్క్: ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. ఇంటి బేస్ మెంట్ నిర్మాణం పూర్తి అయిన తరువాత రూ.లక్ష మంజురు చేశాక, వివిధ సాంకేతిక కారణాలతో బిల్లులు (Indiramma Housing Bills) రానివారికి తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల అమలులో ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, హౌసింగ్ అధికారులతో పొంగులేటి సమీక్ష నిర్వహించారు. మీటింగ్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రస్తావించిన అంశాలపై స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారు.
ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలి..
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణాన్ని సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తుందని పొంగులేటి తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోని వారు, ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా అర్హత ఉంటే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశామని చెప్పారు. ఆయా లబ్ధిదారులు వేగంగా ఇండ్లను నిర్మించుకునేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పేదవారి అభివృద్ధి సంక్షేమం విషయంలో అధికారులు మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడక్కడా నిర్మించి, అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

