కలం, ఖమ్మం బ్యూరో : పేదల సొంత ఇంటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం (Yedulapuram) మున్సిపల్ పరిధిలోని రాంలీలా ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల క్రింద 76 మంది లబ్ధిదారులకు చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత మంజూరు పత్రాలు అందించడం ద్వారా వారి గృహ నిర్మాణ స్వప్నాన్ని నిజం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధినే పరమావధిగా తీసుకుని పనిచేస్తోందని ఆయన తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలుగా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

